Friday, 1 December 2017

నవంబర్ 2017 స్పోర్ట్స్

దివిజ్ జోడికి బెంగళూరు ఓపెన్ డబుల్స్ టైటిల్ భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ 24న జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)-ఎల్గిన్ (రష్యా) జోడి 6-3, 6-0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్-మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది. 


నాగల్‌కు బెంగళూరు ఓపెన్ సింగిల్స్ టైటిల్ భారత ఆటగాడు సుమీత్ నాగల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. బెంగళూరు ఓపెన్ లో నవంబర్ 25న జరిగిన ఫైనల్లో అతను 6-3, 3-6, 6-2తో జే క్లార్క్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ట్రోఫీతో పాటు అతను రూ. 9.36 లక్షల (14,400 డాలర్లు) ప్రైజ్‌మనీని, 100 ర్యాంకింగ్ పాయింట్లను అందుకున్నాడు. 


హాంకాంగ్ ఓపెన్ రన్నరప్‌గా పీవీ సింధు బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో భారత స్టార్ పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. నవంబర్ 26న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 18-21, 18-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి. ఈ సంవత్సరం సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. 


ప్రపంచ యూత్ మహిళల బాక్సింగ్ చాంప్ భారత్ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ చేరిన ఐదుగురు బాక్సర్లూ విజేతలుగా నిలిచి తొలిసారి భారత్‌ను ఓవరాల్ చాంపియన్‌గా నిలబెట్టారు. ఐదు స్వర్ణాలతోపాటు రెండు కాంస్యాలు నెగ్గిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించారు. నీతు (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు)లు నవంబర్ 26న జరిగిన టైటిల్ పోరులో పసిడి సాధించారు. 

గోపీ థోనకల్‌కు ఆసియా మారథాన్ టైటిల్ ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత మారథాన్ రన్నర్ గోపీ థోనకల్ స్వర్ణ పతకం సాధించాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో కేరళకు చెందిన గోపీ చాంపియన్‌గా నిలిచాడు. 42.195 కి.మీ. దూరాన్ని గోపీ 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా పురుషుల విభాగంలో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ రన్నర్‌గా గుర్తింపు పొందాడు. ఆండ్రే పెట్రోవ్ (ఉజ్బెకిస్తాన్-2గం:15ని:51 సెకన్లు) రజతం... బ్యాంబలేవ్ సెవీన్వ్ర్‌డాన్ (మంగోలియా-2గం:16ని:14 సెకన్లు) కాంస్యం గెలిచారు. ఓవరాల్‌గా ఆసియా మారథాన్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ రన్నర్‌గా గోపీ నిలిచాడు. గతంలో మహిళల విభాగంలో ఆశ అగర్వాల్ (1985లో), సునీత గోదర (1992లో) మాత్రమే స్వర్ణాలు గెలిచారు. 1988 వరకు ఈ మారథాన్ రేసు ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఉండేది. 1988 నుంచి ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వేరు చేసి ఈ మారథాన్ రేసును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.


బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఎస్తెబన్ ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. 
నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్ 363 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకోగా... 317 పాయింట్లతో వెటెల్ రన్నరప్‌గా... 305 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. 668 పాయింట్లతో మెర్సిడెస్ జట్టు ప్రపంచ కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించగా... 187 పాయింట్లతో ఫోర్స్ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. 


ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేత..పంకజ్ భారత క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్‌‌డ్స, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ (32) కెరీర్‌లో 18వ ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దోహా లో 2017 నవంబర్ 27న ముగిసిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో అమీర్ నర్థోష్ (ఇరాన్)ను ఓడించి పంకజ్ ఛాంపియన్‌గా నిలిచాడు.
బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్; 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్; 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. 


ఫ్రాన్స్ కు డేవిస్ కప్ టైటిల్డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. పారిస్‌లో 2017 నవంబర్ 26న ముగిసిన ఫైనల్లో బెల్జియంను 3-2 తేడాతో ఫ్రాన్‌‌స ఓడించింది. ఫ్రాన్‌‌సకిది పదో డేవిస్ కప్ టైటిల్.

పాకిస్తాన్ బౌలర్ హఫీజ్ పై మళ్లీ నిషేధం పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ మహమ్మద్ హఫీజ్ బౌలింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ మరోసారి నిషేధం విధించింది. గత నెలలో శ్రీలంకతో సీరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో హఫీజ్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని గుర్తించిన ఐసీసీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో 2014 డిసెంబర్‌లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్.. రెండోసారి 2015 జూన్‌లో ఏడాది నిషేధానికి గురయ్యాడు.


పుణే ఓపెన్ విజేత యూకీ భారత్‌లో ఈ సంవత్సరం జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పుణే ఓపెన్‌లో భారత స్టార్ యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. నవంబర్ 18న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 4-6, 6-3, 6-4తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. యూకీ కెరీర్‌లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్.


ఏటీపీ వరల్డ్ టూర్ పురుషుల టైటిల్ విజేత దిమిత్రోవ్ పురుషుల టెన్నిస్ సీజన్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ దిమిత్రోవ్ చాంపియన్‌గా అవతరించాడు. నవంబర్ 19న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో... దిమిత్రోవ్ 7-6, 4-6, 6-3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. తద్వారా 1998లో అలెక్స్ కొరెత్యా (స్పెయిన్) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్ గుర్తింపు పొందాడు. 
విజేతగా నిలిచిన దిమిత్రోవ్‌కు 25,49,000 డాలర్లు (రూ. 16 కోట్ల 58 లక్షలు), రన్నరప్ గాఫిన్‌కు 11,58,000 డాలర్లు (రూ. 7 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 


ఆఫ్గాన్‌కు అండర్-19 ఆసియా కప్ క్రికెట్ అండర్-19 ఆసియా కప్ వన్డే టైటిల్‌ను అఫ్గానిస్తాన్ గెలుచుకుంది. కౌలాలంపూర్‌లో నవంబర్ 19న జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది.

టెన్నిస్ క్రీడాకారిణి యానా నొవొత్నాకన్నుమూతచెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి యానా నొవొత్నా (49) నవంబర్ 19న మరణించారు. ఆమె కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన నొవొత్నా.. సింగిల్స్‌లో రెండో ర్యాంక్ అందుకున్నారు. 1993లో స్టెఫీగ్రాఫ్ 
(జర్మనీ) చేతిలో, 1997లో మార్టినా హింగిస్
(స్విట్జర్లాండ్) చేతిలో వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్‌లో ఓడిపోయిన నొవొత్నా 1998లో నటాలీ తౌజియట్ (ఫ్రాన్స్)ను ఓడించి టైటిల్ సాధించారు. 1987 నుంచి 1999 వరకు సాగిన కెరీర్‌లో 24 సింగిల్స్, 76 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.

జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప్స్ సైనా, ప్రణయ్పదేళ్ల తర్వాత జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మూడోసారి విజేతగా నిలిచింది. నవంబర్ 8న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21-17, 27-25తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించింది. సైనా 2006, 2007లలో కూడా జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది. పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా విజేత హోదాలో రూ. రెండు లక్షల ప్రైజ్‌మనీని అందుకుంది. 



ప్రణయ్‌కు పురుషుల టైటిల్జాతీయ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కేరళ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ సిక్కి రెడ్డి ఐదోసారి మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో సిక్కి-అశ్విని ద్వయం 21-14, 21-14తో సంయోగిత-ప్రాజక్తా జంటపై గెలిచింది. 2012లో అపర్ణా బాలన్‌తో, 2014, 2015, 2016లలో ప్రద్న్యా గాద్రెతో కలిసి సిక్కి జాతీయ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 


ఆసియా సీనియర్ బాక్సింగ్‌లో మేరీకోమ్‌కు స్వర్ణం ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ (34) చాంపియన్‌గా నిలిచింది. 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 5-0తో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి పసిడి పతకాన్ని గెలుచుకుంది. 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సోనియా లాథెర్ రజత పతకంతో సంతృప్తి పడింది. ఫైనల్లో యిన్ జాన్‌హువా (చైనా) చేతిలో సోనియా ఓడిపోయింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం, ఐదు కాంస్యాలు లభించాయి. 
2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తర్వాత మేరీకోమ్ ఖాతాలో చేరిన మరో స్వర్ణం ఇదే. మొత్తంగా ఆసియా చాంపియన్‌షిప్‌లో మెరీకోమ్‌కు ఇది ఐదో స్వర్ణం. గతంలో ఆమె 2003లో (46 కేజీలు), 2005లో (46 కేజీలు), 2010లో (51 కేజీలు), 2012లో (51 కేజీలు) స్వర్ణాలు సాధించింది. 2008లో (46 కేజీలు) రజతం దక్కించుకుంది. 


జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్ లలిత్ బాబుఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో నవంబర్ 10న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో లలిత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్ బాబు పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. 


జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ స్వ్కాష్ టోర్నీలో సౌరవ్‌కు టైటిల్ భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ తన కెరీర్‌లో ఏడో ప్రొఫెషనల్ టైటిల్‌ను సాధించాడు. నవంబర్ 10న ముగిసిన జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ అంతర్జాతీయ స్క్వాష్ సర్క్యూట్ టోర్నీలో ప్రపంచ 21వ ర్యాంకర్ సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరవ్ 11-6, 11-8, 11-8తో ఐదో సీడ్ నికొలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సౌరవ్‌కు 7,671 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు) లభించింది.


17వ ప్రపంచ బిలియర్డ్స్ చాంప్‌గా పంకజ్ అద్వానీ భారత క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ 17వ సారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్(150 అప్ ఫార్మాట్)గా నిలిచాడు. నవంబర్ 12న జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-2 (0-155, 150-128, 92-151, 151-0, 151-6, 151-0, 150-58, 150-21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. 2016లో బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు. 
గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్-2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్-2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు.


యూఏఈలో ధోని అకాడమీ ప్రారంభం భారత క్రికెటర్ ధోని అకాడమీ.. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రారంభమైంది. దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్‌‌ట్స క్లబ్, ఆర్కా స్పోర్‌‌ట్స క్లబ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రానికి ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) అని పేరు పెట్టారు. నవంబర్ 11న ఈ అకాడమీని ధోని లాంఛనంగా ప్రారంభించాడు. 


బ్రెజిల్ గ్రాండ్‌ప్రి విజేత సెబాస్టియన్ వెటెల్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్ గంటా 31 నిమిషాల 26.262 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. రెండో స్థానంలో వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచారు. 
తాజా గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో వెటెల్‌కు (302 పాయింట్లు) రెండో స్థానం ఖాయమైంది. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది. 


పేస్ - రాజాకు నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టైటిల్ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. భారత్‌కే చెందిన పురవ్ రాజా ద్వయం అమెరికాలో జరిగిన నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్-పురవ్ రాజా ద్వయం 7-6 (7/4), 7-6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


ఫెడ్‌కప్ విజేత అమెరికా ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘ఫెడ్ కప్’ను అమెరికా జట్టు సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్‌‌స, ప్రపంచ పదో ర్యాంకర్ కోకో వాండెవె, షెల్బీ రోజర్స్, అలీసన్ రిస్కీ సభ్యులుగా ఉన్న అమెరికా ఫైనల్లో 3-2తో బెలారస్‌పై గెలిచింది. చివరిసారి 2000లో ఫెడ్ కప్‌ను దక్కించుకున్న అమెరికా తాజా విజయంతో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 


కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలుకామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత్ షూటర్లు రెండు స్వర్ణ పతకాలు గెలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో షాజర్ రిజ్వీ 240.7 పాయింట్లతో స్వర్ణాన్ని దక్కించుకోగా, 236 పాయింట్లతో ఓంకార్ సింగ్ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్ కాంస్యం సాధించారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పూజా ఘాట్కర్ 249.8 పాయింట్లతో స్వర్ణం సాధించగా అంజుమ్ మౌద్గిల్ 248.7 పాయింట్లతో రజతం గెలిచింది. పోటీల తొలి రోజు హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) స్వర్ణం, దీపక్ కుమార్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) రజతం గెలిచారు.


కామన్వెల్త్ షూటింగ్‌లో గగన్‌కు రజతం 
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్ రజత పతకం గెలుచుకున్నాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ ఫైనల్‌లో గగన్ 246.3 పాయింట్లు సాధించి రజతం గెలవగా, స్వప్నిల్ కుసాలే 225.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అన్నురాజ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకుంది. 


పద్మశ్రీ కి శ్రీకాంత్ పేరు సిఫారసు భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పేరును కేంద్ర పౌర పురస్కారం ‘పద్మశ్రీ’కు సిఫారసు చేశారు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలవడంతోపాటు మరో సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. దీంతో నామినేషన్ల గడువు సెప్టెంబర్ 15తో ముగిసినప్పటికీ కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయల్ ప్రత్యేక చొరవతో శ్రీకాంత్ పేరును పరిశీలించాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. 


క్రికెట్‌కు ఆశిష్ నెహ్రా వీడ్కోలు భారత మీడియం ఫేస్ బౌలర్ (లెఫ్టార్మ్) ఆశిష్ నెహ్రా (38) క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. నవంబర్ 1న న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 1999లో అజారుద్దీన్ కెప్టెన్సీలో ఆరంగేట్రం చేసిన నెహ్రా 18 ఏళ్ల 250 రోజుల సుదీర్ఘ కెరీర్ కొనసాగించారు. 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడిన నెహ్రా మొత్తం 235 వికెట్లు తీసుకున్నాడు. 


కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రకాశ్, అంకుర్ కు స్వర్ణాలు కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు ప్రకాశ్ సంజప్ప, అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాలు గెలిచారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో ప్రకాశ్ నంజప్ప స్వర్ణం నెగ్గగా, అమన్‌ప్రీత్ సింగ్ రజతం, జీతూ రాయ్ కాంస్యం సాధించారు. పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ పసిడి నెగ్గగా మహిళల డబుల్ ట్రాప్‌లో శ్రేయసి సింగ్ రజతం గెలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ 15 పతకాలు సాధించింది. 


జాతీయ అంధుల వన్డే టోర్నీ విజేత ఆంధ్రప్రదేశ్ జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముంబైలో నవంబర్ 3న ముగిసిన ఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. గుజరాత్ నిర్ణీత 35 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఏపీ జట్టు 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టు సారథి అజయ్‌రెడ్డి ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. 


ఆసియా కప్ మహిళల హకీ విజేత భారత్ భారత మహిళల జట్టు ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. నవంబర్ 5న జపాన్‌లో జరిగిన ఫైనల్లో ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4తో చైనాపై విజయం సాధించింది. తద్వారా 2018లో లండన్‌లో జరిగే ప్రపంచకప్‌కు ఆసియా చాంపియన్ హోదాలో నేరుగా అర్హత సాధించింది. 
భారత్ ఈ కప్ గెలవడం ఇది రెండోసారి. గతంలో 1999, 2004, 2009లలో ఫైనల్‌కు చేరినప్పటికీ 2004లో మాత్రమే టైటిల్ నెగ్గింది. ఈ టోర్నీలో సవిత ‘బెస్ట్ గోల్‌కీపర్’ అవార్డును గెల్చుకుంది. 


ఆసియా టూర్ టైటిల్ విజేత శివ్ కపూర్ భారత స్టార్ గోల్ఫర్ శివ్ కపూర్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నవంబర్ 5న ఢిల్లీలో జరిగిన పానాసోనిక్ ఓపెన్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఈ ఏడాది శివ్ కపూర్‌కిది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా కెరీర్‌లో మూడోది. 2005లో శివ్ కపూర్ తొలిసారి వోల్వో మాస్టర్స్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలిచాడు. 


కామన్వెల్త్ షూటింగ్‌లో సత్యేంద్రకు స్వర్ణం కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు (నవంబర్ 6) భారత్‌కు పసిడి పతకంతోపాటు రజతం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో సత్యేంద్ర సింగ్ బంగారు పతకం సొంతం చేసుకోగా.. సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
ఆస్ట్రేలియాలో నవంబర్ 6న ముగిసిన కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు దక్కించుకుంది. 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ భారత్ కైవసం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కేరళలో నవంబర్ 7న ముగిసిన మూడో టీ20లో 6 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీంతో సిరీస్ భారత్ సొంతం అయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు రెండూ బుమ్రానే గెలుచుకున్నాడు. 


చెన్నైలో ఏటీపీ చాలెంజర్ టోర్నీ 2018 ఫిబ్రవరి నుంచి చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీని నిర్వహించనున్నట్లు తమిళనాడు టెన్నిస్ సంఘం (టీఎన్‌టీఏ) నవంబర్ 7న తెలిపింది. ఇందుకోసం ది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించింది. 50వేల డాలర్ల (దాదాపు రూ.33 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత ప్లేయర్లు అంతర్జాతీయ ఆటగాళ్లతో పోటీ పడేందుకు ఈ టోర్నీ ఉపయోగపడనుందని టీఎన్‌టీఏ చీఫ్ అలగప్పన్ తెలిపారు. 




No comments:

Post a Comment