Thursday, 28 June 2018

మే 2018 స్పోర్ట్స్

యూత్ బాక్సింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు గెలిచారు. ఏప్రిల్ 27న జరిగిన మహిళల విభాగంలో నీతు గంగాస్ (48 కేజీలు), మనీషా (64 కేజీలు), లలిత (69 కేజీలు) లు గెలుపొంది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఫైనల్లో నిల్లాడ మీకూన్ (థాయ్‌లాండ్)పై నీతు, ఇడిమోఖ్ ఖొలోవా (తజికిస్తాన్)పై మనీషా, బెసైబయోవా మైయా (కజకిస్తాన్)పై లలిత విజయం సాధించారు.


అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్ 
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి రేసులో ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) విజయం సాధించాడు. ఏప్రిల్ 29న జరిగిన ఈ రేసులో 51 లాప్‌ల దూరాన్ని హామిల్టన్ గంటా 43 నిమిషాల 44.291 సెకన్లలో చేరుకున్నాడు. మరోవైపు ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ గంటా 43 నిమిషాల 48.315 సెకన్లలో రేసును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. 2016లో బాకులో జరిగిన యూరోపియన్ గ్రాండ్‌ప్రిలో కూడా పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. 
 

ప్రజ్నేశ్‌కు ఏటీపీ చాలెంజర్ టైటిల్ 
భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కెరీర్‌లో తొలిసారి ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్ టైటిల్ సాధించాడు. చైనాలోని యానింగ్‌లో ఏప్రిల్ 29న జరిగిన కున్‌మింగ్ ఏటీపీ చాలెంజర్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ మహ్మద్ సఫ్వాత్ (ఈజిప్ట్)పై గెలుపొందాడు. దీంతో ప్రజ్ఞేశ్ టాప్-200 ర్యాంకులో నిలిచే అవకాశముంది. ఇప్పటికే యూకీ బాంబ్రీ (83), రామ్‌కుమార్ రామ్‌నాథన్ (115) టాప్-200లో ఉన్నారు. 


అంతర్జాతీయ బాక్సింగ్‌లో నిఖత్ కు స్వర్ణం 
బెల్‌గ్రేడ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెర్బియాలో ఏప్రిల్ 28న జరిగిన మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్(నిజామాబాద్) 3-0తో ఐకతెరిని కుట్‌సోజియోర్‌గోపులు (గ్రీస్)పై విజయం సాధించింది. 


ఉజ్బెకిస్తాన్ ఐటీఎఫ్ టోర్నీ విజేత సాకేత్ 
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్-2 టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని విజేతగా నిలిచాడు. కర్షీలో ఏప్రిల్ 28న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సాకేత్ షైలా యారాస్లావ్ (బెలారస్)పై గెలిచాడు. సాకేత్ కి ఇది 12వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్. 


ఆసియా బ్యాడ్మింటన్ చాంపిన్‌షిప్ 
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జపాన్‌కు చెందిన కెంటో మొమోటా గెలుచుకున్నాడు. దీంతో ఈ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. వుహాన్(చైనా)లో ఏప్రిల్ 29న జరిగిన ఫైనల్లో చెన్ లాంగ్(చైనా)పై కెంటో గెలుపొందాడు. కాగా, మహిళల సింగిల్స్ టైటిల్‌ను తైవాన్‌కు చెందిన తాయ్ జు ఇంగ్ గెలుచుకుంది.

No comments:

Post a Comment