Thursday, 28 June 2018

ఫిబ్రవరి 2018 స్పోర్ట్స్


వింటర్ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్ :: వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 14 పతకాలు గెలిచిన ప్లేయర్‌గా నార్వేకు చెందిన మారిట్ జోర్జెన్ చరిత్ర సృష్టించింది. తాజా ఒలింపిక్స్‌లో ఆమె ఖాతాలో నాలుగో పతకం చేరింది. స్కీయింగ్‌లో మెరిక అయిన జోర్జెన్ క్రాస్ కంట్రీ టీమ్ స్ప్రింట్ ఫ్రీ ఈవెంట్‌లో మైకెన్ కాస్పెర్సన్ ఫల్లాతో కలిసి కాంస్య పతకం గెలుచుకుంది. దాంతో 13 పతకాలతో నార్వే క్రీడాకారుడు ఒలె ఇనార్ జోర్న్‌డాలెన్ (నార్వే) పేరిట ఉన్న రికార్డును ఆమె తెరమరుగు చేసింది. ఏ ఒలింపిక్స్ (వింటర్, సమ్మర్)లోనైనా అత్యధిక పతకాలు గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా 37 ఏళ్ల జోర్జెన్ ఘనత వహించింది. అలనాటి సోవియెట్ (ఇప్పటి ఉక్రెయిన్) జిమ్నాస్ట్ దిగ్గజం లారిసా లాతినినా సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 18 పతకాలు సాధించింది.


ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో అరుణ రెడ్డికి కాంస్యం తెలుగు అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో పతకం సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల అరుణ వాల్ట్ ఈవెంట్‌లో మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. ఫైనల్లో అరుణ రెడ్డి 13.649 పాయింట్లు స్కోరు చేసింది. జాసా కిస్‌లెప్ (స్లొవేనియా-13.800 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... ఎమిలీ (ఆస్ట్రేలియా -13.699 పాయింట్లు) రజతం గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ (13.416 పాయింట్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 


ఆస్ట్రియా బ్యాడ్మింటన్ ఓపెన్ విజేత కశ్యప్ 
ఆస్ట్రియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ సొంతం చేసుకున్నాడు. ఫిబ్రవరి 24న జరిగిన ఫైనల్లో కశ్యప్ 23-21, 21-14తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో కశ్యప్ 21-18, 21-4తో రౌల్ మస్త్ (ఎస్తోనియా)ను ఓడించాడు. 2015లో సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలిచాక కశ్యప్ నెగ్గిన మరో టైటిల్ ఇదే.


దక్షిణాఫ్రికాతో టీ20 సీరీస్ గెలుచుకున్న మిథాలి సేన
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత నారీమణుల జట్టు చరిత్రకెక్కే సిరీస్‌లను కై వసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదట వన్డే సిరీస్‌ను, తాజాగా టి20 సిరీస్‌నూ కై వసం చేసుకొని ఇక్కడ రెండు ఫార్మాట్లలలో నెగ్గిన తొలి జట్టుగా ఘనత వహించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-1తో కై వసం చేసుకుంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న భారత్ వరుస సిరీస్‌లతో దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించింది. 

దక్షిణాఫ్రికాతో టీ20 సీరీస్ గెలుచుకున్న ఇండియా 
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సీరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. ఫిబ్రవరి 24న జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో 7 పరుగులతో భారత్ జయకేతనం ఎగురవేసింది. సురేశ్ రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. 

బెస్ట్ బాక్సర్’గా వికాస్ కృషన్ 
స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారాన్ని పొందాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత బాక్సర్‌కు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. పురుషుల 75 కేజీల విభాగంలో వికాస్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో వికాస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత ట్రాయ్ ఇస్లే (అమెరికా)ను ఓడించాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాక వికాస్ ఖాతాలో చేరిన మరో పతకం ఇదే. 
ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలను గెల్చుకున్నారు.


విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక 
వన్డే ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. ఫిబ్రవరి 27న సౌరాష్ట్రతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 41 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 45.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక ప్లేయర్ మయాంక్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 


కేప్‌టౌన్’కు భారత్, దక్షిణాఫ్రికా జట్ల సాయం
తీవ్ర వర్షాభావంతో నీటికి కటకటలాడుతున్న కేప్‌టౌన్‌కు భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు 8,500 అమెరికన్ డాలర్లు (రూ.5.52 లక్షలు) విరాళం ప్రకటించాయి. ఈ డబ్బును నగరంలో బాటిళ్లతో నీటి సరఫరా, బోర్లు వేసేందుకు వినియోగిస్తారు. ఫిబ్రవరి 24న కేప్‌టౌన్‌లోని న్యూలాండ్‌‌సలో మూడో టి20 అనంతరం ఈ మొత్తాన్ని రెండు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్‌లు ‘గివర్స్ ఫౌండేషన్’కు అందజేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుతో పాటు మూడో వన్డే, చివరి టి20లకు కేప్‌టౌన్ ఆతిథ్యమిచ్చింది. ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీల వేలం ద్వారా నగరంలో నీటి ఎద్దడి నివారణకు నిధులు సేకరించాలని తాను, కోహ్లి చర్చించుకున్నామని డు ప్లెసిస్ చెప్పాడు.

స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సమీర్ వర్మభారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సమీర్ వర్మ స్విస్ ఓపెన్(బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. వియన్నాలో ఫిబ్రవరి 25న జరిగిన ఫైనల్లో జాన్ జార్జెన్‌సెన్(డెన్మార్క్)ను సమీర్ ఓడించాడు.

భారత హాకీకి ప్రధాన స్పాన్సర్‌గా ఒడిశా ఆనవాయితీకి భిన్నంగా ఒడిశా సర్కారు జాతీయ క్రీడ హాకీకి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. వచ్చే ఐదేళ్ల పాటు ఒడిశా ప్రభుత్వం భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్‌షిప్ అందించనుంది. భారత క్రీడల చరిత్రలో ఓ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించిన వేడుకలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విషయాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో భారత పురుషులు, మహిళా జట్ల సభ్యులు, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్), ఐఓఏ అధ్యక్షుడు కూడా అయిన నరీందర్ బాత్రా, ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా తదితరులు పాల్గొన్నారు. 
2014 చాంపియన్‌‌స ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన భువనేశ్వర్‌లో 2018 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. 


ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్‌లో ఏపీ బాక్సర్‌కు స్వర్ణం 
ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ బంగారు పతకం సాధించాడు. ఈ పోటీల్లో మరో నలుగురు భారత బాక్సర్లు కూడా పసిడి పతకాలు నెగ్గారు. మూడు సార్లు కింగ్‌‌స కప్‌లో విజేతగా నిలిచిన శ్యామ్ కుమార్ 49 కేజీల ఫైనల్లో 4-1తో మరియో బ్లాసియస్ కలి (ఇండోనేసియా)పై గెలుపొందాడు. ఇతనితో పాటు మనీశ్ కౌషిక్, షేక్ సల్మాన్ అన్వర్, ఆశిష్, మహిళల ఈవెంట్‌లో పవిత్ర బంగారు పతకాలు సాధించారు. మరో మహిళా బాక్సర్ శశి చోప్రా (57 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకుంది.


దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్ గెలిచిన భారత్ 
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వన్డేల సీరీస్‌ను భారత్ 5-1తో గెలుచుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సీరీస్‌ను గెలుచుకుంది. ఫిబ్రవరి 17న జరిగిన ఆరో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (96 బంతుల్లో 129 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ముందుండి జట్టును గెలిపించాడు. ఈ సిరీస్‌లో 3 సెంచరీలు, 1 అర్ధసెంచరీ సహా 186 సగటుతో 558 పరుగులు చేసిన కోహ్లికే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 

ఆరేళ్ల తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌గా ఫెడరర్ యువ ఆటగాళ్లకు దీటుగా ఆడుతూ... సమకాలీకులపై పూర్తి ఆధిప త్యం చలాయిస్తూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను తాజాగా రోటర్‌డామ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. 26 వారాలుగా నంబర్‌వన్ స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో ర్యాంక్‌కు పడిపోనున్నాడు. 
  • అగ్రస్థానానికి చేరుకున్న క్రమంలో ఫెడరర్ తన పేరిట ఎన్నో ఘనతలు లిఖించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న పెద్ద వయస్కుడిగా (36 ఏళ్ల 6 నెలల 11 రోజులు) ఫెడరర్ గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ అగస్సీ (33 ఏళ్లు; అమెరికా 2003లో) పేరిట ఉండేది.
  • కోల్పోయిన టాప్ ర్యాంక్‌ను మళ్లీ అందుకునేందుకు ఎక్కువ విరామం (5 ఏళ్ల 106 రోజులు) తీసుకున్న ప్లేయర్‌గానూ ఫెడరర్ రికార్డు నెలకొల్పాడు. 2012 నవంబర్ 4న నంబర్‌వన్ ర్యాంక్ చేజార్చుకున్న ఫెడరర్ ఈనెల 19న మళ్లీ దానిని అందుకోనున్నాడు.
  • తన కెరీర్‌లో 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నంబర్‌వన్ అయిన ఫెడరర్ రికార్డుస్థాయిలో వరుసగా 237 వారాలు ఆ స్థానంలో ఉన్నాడు. 2008 ఆగస్టు 17న టాప్ ర్యాంక్ కోల్పోయిన అతను మళ్లీ రెండుసార్లు (2009 జూలై 6 నుంచి 2010 జూన్ 6 వరకు; 2012 జూలై 9 నుంచి 2012 నవంబర్ 4 వరకు) శిఖరాగ్రానికి చేరుకున్నాడు.

ఫెడరర్‌కు రోటర్‌డామ్ ఓపెన్ టైటిల్ 

ఫిబ్రవరి 19న ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఫెడరర్ గెలుచుకున్నాడు. ఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను అలవోకగా ఓడించాడు. తద్వారా తన కెరీర్‌లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

స్టార్ ఇండియాకు ఐపీఎల్ ఆడియో-విజువల్ హక్కులు 
స్టార్ ఇండియా 2018-19 సీజన్‌కు ఐపీఎల్‌తో పాటు బీసీసీఐ దేశవాళీ సీజన్ ఆడియో, వీడియో ప్రొడక్షన్ హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కులు కలిగి ఉంది. ‘మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి బీసీసీఐ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించింది. ఐపీఎల్ 2018, 2018-19 సీజన్ ప్రొడక్షన్ హక్కులు స్టార్ ఇండియాకు దక్కాయి’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌధురి వెల్లడించారు. ఇదే ఒప్పందాన్ని యథాతథంగా మరో ఏడాది పొడిగించేందుకు, 2020 ఐపీఎల్‌కు ప్రత్యేకంగా కొనసాగించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉందని అమితాబ్ తెలిపాపరు.
ఐపీఎల్ అయిదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్, గ్లోబల్ ప్రసార హక్కులను గతేడాది స్టార్ ఇండియా రూ.16,347 కోట్లకు దక్కించుకుంది. 


వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం వేదికగా ప్రతిష్టాత్మక వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 9న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 92 దేశాల నుంచి 2,920 మంది క్రీడాకారులు 102 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (శివ కేశవన్, జగదీశ్) బరిలో ఉన్నారు. వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న శివ కేశవన్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా వ్యవహరించాడు. 


ఇండియా ఓపెన్ విజేత సౌరవ్
భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 11న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 11-9, 5-11, 6-11, 11-7, 12-10తో నికోలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు.

న్యూఢిల్లీలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ దేశంలో క్రీడల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ (కేఐఎస్‌జీ)’ జనవరి 31న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న క్రీడా పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సమర్థమైన ఆర్మీ, బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే చాలదని, క్రీడాభివృద్ధి కూడా జరగాలని అన్నారు. ఖేలో ఇండియా పోటీలు క్రీడల్లో భారత్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్తాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏటా 1000 మంది ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి 8 ఏళ్ల పాటు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని వెల్లడించారు. 
అండర్-17 విభాగంలో 16 క్రీడాంశాల్లో ఫిబ్రవరి 8 వరకు ఈ పోటీలు జరగుతాయి. ఇందులో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5000 పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారు. 

మానవ్‌కు టీటీ అండర్-18 టాప్ ర్యాంక్
భారత యువ ఆటగాడు మానవ్ వికాస్ ఠక్కర్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో టాప్ ర్యాంక్‌ను చేరుకున్నాడు. గుజరాత్‌కు చెందిన మానవ్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకులో 6,396 రేటింగ్ పాయింట్లతో అండర్-18 బాలుర సింగిల్స్ విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా మానవ్ చరిత్రకెక్కాడు.


ఇండియా ఓపెన్ టోర్నీలో భారత్‌కు 8 స్వర్ణాలు
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 1న ముగిసిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. 18 కేటగిరీలలో కలిపి 8 స్వర్ణాలు, 10 రజతాలు, 23 కాంస్య పతకాలతో మొత్తం 41 పతకాలను సొంతం చేసుకున్నారు.
మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మనీషా (54 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), ప్విలావో బసుమతిరి (64 కేజీలు)... పురుషుల విభాగంలో సంజీత్ (91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను గెలుపొందారు.
పురుషుల 49 కేజీల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ 0-5తో భారత్‌కే చెందిన అమిత్ చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకం గెలుచుకున్నాడు.


అండర్ - 19 ప్రపంచ కప్ విజేత భారత్ 
న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్ - 19 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. మౌంట్ మాంగనీలో జరిగిన ఫైనల్లో టీ మిండియా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ గెల్చుకుని కొత్త రికార్డు నెలకొల్పింది. 
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఓపెనర్ మన్‌జ్యోత్ కల్రా (102 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత శతకంతో భారత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కల్రాకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్ (6 మ్యాచ్‌ల్లో 372 పరుగులు; ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు) ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. 
భారత్ ఇంతకముందు 2000, 2008, 2012లో అండర్ - 19 ప్రపంచ కప్ గెలుచుకుంది. 


ఇండియా ఓపెన్ టైటిల్ విజేత బీవెన్ జాంగ్
ఇండియా ఓపెన్ టైటిల్‌ను చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 4న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, టాప్ సీడ్ సింధుని ఓడించి జాంగ్ టైటిల్‌ను గెలుచుకుంది. తన కెరీర్‌లో సింధుపై జాంగ్‌కిది వరుసగా రెండో విజయం. గతేడాది ఇండోనేసియా ఓపెన్‌లోనూ సింధును జాంగ్ ఓడించింది. విజేతగా నిలిచిన జాంగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 83 వేలు), 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 53 వేలు), 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చైనాలో జన్మించిన 27 ఏళ్ల బీవెన్ జాంగ్ 2007 నుంచి 2013 వరకు సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2013 నుంచి అమెరికా తరఫున ఆడుతోంది. 




No comments:

Post a Comment